వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ఇక్కడ లేఖలు.. అక్కడ సహకారం: ఏపీ ప్రభుత్వంపై కనకమేడల ఆగ్రహం

  • విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తుతాం
  • కేంద్రానికి లేఖలు రాసినట్టే రాసి లోపాయికారీ ఒప్పందం
  • రాజీనామాలు చేసి పోరాడేందుకు మేం సిద్ధం
  • వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, కలిసి రావాలి
వైసీపీ ప్రభుత్వ వైఖరితో కేంద్రం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని టీడీపీ నేత, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తుతామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసి పోరాడేందుకు తాము సిద్ధమని ప్రకటించిన కనకమేడల.. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి పోరాడాలని డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన ప్రభుత్వం కేంద్రానికి మాత్రం లోపాయికారీగా సహకరిస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ సహకారం లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసాధ్యమని కనకమేడల స్పష్టం చేశారు.




Vizag Steel Plant
Kanakamedala Ravindra Kumar
TDP
Andhra Pradesh

More Telugu News